మున్సిపల్ స్థలంలో అక్రమ కట్టడాలు
చోద్యం చూస్తున్న బల్దియా
బెల్లంపల్లి, జూన్ 11 (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని ఎస్బీఐ ఎదుట ఉన్న మున్సిపల్ స్థలంలో అక్రమ కట్టడాలు వెలిశాయి. సాధారణంగా ఇక్కడ బ్యాంక్కు వచ్చిన సిబ్బంది, ఖాతాదారులు వాహనాలు పార్క్ చేసుకుంటారు. ఆ స్థలం ఆక్రమణకు గురికావడంతో పార్కింగ్కు స్థలం లేకుండాపోయింది. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన వ్యాపార కూడలిలోని ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమవుతున్నా మున్సిపల్ అధికారులు నోరుమెదపడం లేదు. కొందరు ఏకంగా కట్టడాలకు ఇప్పటికే పునాదులు నిర్మించారు. రాత్రికి రాత్రే వ్యాపార సముదాయాలు వెలుస్తున్నా మిన్నకుంటున్నారు. ఆ ప్రాంతంలో ప్రధాన మురుగు కాలువ ఉన్నప్పటికీ, అక్రమార్కులు కాలువ పక్కనే కట్టడాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి అక్రమ కట్టడాలు నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.






