14-01-2026 04:55:46 PM
పట్టించుకోని పోలీసులు, రవాణా శాఖ అధికారులు..
నిత్యం వందల భారీ వాహనాల్లో మట్టి తరలింపు..
తాండూరు,(విజయక్రాంతి): అసలే అధ్వానంగా మారిన రోడ్లు.. పైగా ఓవర్ లోడ్ తో వెళుతున్న భారీ భారీ వాహనాలు రోడ్డు ఎక్కడంతో రోడ్లు మరింత అద్వాన్నంగా మారడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండలం తట్టేపల్లి ప్రాంతంలో ఎర్ర మట్టి తవ్వకాలు జరుపుతూ భారీ టిప్పర్ వాహనాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ లోడ్ చేసుకొని అక్రమంగా రవాణా చేస్తున్నారు. ప్రతినిత్యం దాదాపు 100కు పైగా భారీ వాహనాల్లో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న సిమెంట్ కర్మగారాలకు తరలిస్తున్నారు.
ఇలా గ్రామం నడిబొడ్డు నుండి అక్రమ రవాణా చేస్తుండడంతో ప్రయాణికులు, పాదచారులు, చిన్నారులు రోడ్డుపై వెళ్లాలంటేనే భయాందోళనలకు గురవుతున్నారు. ఓవర్ లోడ్ రవాణా అడ్డుకోవాల్సిన రవాణాశాఖ అధికారులు, పోలీసులు మామూళ్ల మత్తులో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మరియు పోలీసులు స్పందించి ఓవర్ లోడ్ తో వెళుతున్న వాహనాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.