28-11-2025 12:20:15 AM
-రావల్పిండి అడియాలా జైలు అధికారులు
-జైలులో ఇమ్రాన్ మృతి చెందారనేవి వదంతులే..
-కుటుంబ సభ్యులతో భేటీకి అనుమతించాలని పీటీఐ డిమాండ్
ఇస్లామాబాద్, నవంబర్ 27: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ జైలులో మరణించారంటూ సోషల్ మీడియాలో వ్యాపించిన వదంతులపై రావల్పిండిలోని అడియాలా జైలు అధికారు లు గురువారం స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన పూర్తి ఆరోగ్యం గా ఉన్నారని పేర్కొన్నారు. ఆయన్ని జైలు నుంచి ఎక్కడికీ తరలించలేదని, ప్రస్తుతం తమ వద్దే ఉన్నారని తెలిపారు.జైలు అధికారులు విడుదల చేసిన ప్రకటనలో, ‘ఇమ్రాన్ ఖాన్ను అడియాలా జైలు నుంచి తరలించారనే కథనా ల్లో వాస్తవం లేదు.
ఆయన సంపూర్ణ ఆరోగ్యం తో ఉన్నారు, అవసరమైన పూర్తి వైద్య సంరక్షణ అందిస్తున్నాం‘ అని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను నిరాధారమైనవని కొట్టిపారేశారు. పాక్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ కూడా ఇదేవిషయాన్ని స్ప ష్టం చేశారు. ఇమ్రాన్ బయట కంటే జైలులో సౌకర్యవంతంగా ఉన్నారన్నారు. ఈ వదంతులపై ఇమ్రాన్ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్- ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) ఆందోళన వ్యక్తం చేసింది.
ఇమ్రాన్ మద్దతుదారుల ఆందోళన
ఇమ్రాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని, ఇమ్రాన్తో ఆయన కుటుంబ సభ్యుల భేటీని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. కొన్ని వారాలుగా ఇమ్రాన్ సోదరీమణులను ఆయ న్ని కలిసేందుకు అనుమతించక పోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.