29-11-2025 01:19:55 AM
ముంబై, నవంబర్ 28: ‘పార్టీ అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న అలియాస్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు లొంగిపోవడం, హిడ్మా ఎన్కౌంటర్తో పార్టీ బలహీనపడింది. మేం ఆయుధాలు పక్కన పెడతాం. ఒక్కొక్కరుగా కాకుండా, మేమంతా ఒకేసారి జనవరి 1న లొంగిపోతాం. దయచేసి కూంబింగ్ చేపట్టొద్దు. కాల్పులు వద్దు’ అంటూ మావోయిస్టు పార్టీ మహారాష్ట్ర-, మధ్యప్రదేశ్, -ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ (ఎంఎంసీ) జోన్ ప్రతినిధి అనంత్చ పేరిట శుక్రవారం లేఖ విడుదలైంది.
లేఖ విడుదలై 24 గంటలు గడవకముందే అనంత్ అనూహ్యంగా మరో 11 మంది మావోయిస్టులతో కలిసి మహారాష్ట్రలోని గోండియా జిల్లా దారేక్ష పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అనంత్ తలపై రూ.కోటి రివార్డు ఉంది. లొంగిపోయిన వారిలో ఎంఎంసీ ఇన్చార్జి, విస్తార్ మూడో ప్లటూన్ కమాండర్ సురేంద్ర ఎలియాస్ మద్వి సీమ కూడా ఉన్నాడు. ఈయనపై రూ.60 లక్షల రివార్డు ఉంది.