18-08-2025 10:50:20 PM
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బాలికల గురుకుల కళాశాల,సాంఘీక సంక్షేమ బాలుర సీవోఈ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరిచేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య తెలిపారు.బెల్లంపల్లి పట్టణం లోని సాంఘిక సంక్షేమ బాలికల,బాలుర సీవోఈ కళాశాలను ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను సిబ్బంది ప్రిన్సిపల్ సొంత బిడ్డలాగా చూసుకోవాలని ప్రిన్సిపల్ నిరూపమకు సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణం కాంపౌండ్ వాల్ సోలార్ ఫెన్సింగ్ నిర్మించాలని, బాలుర సీవోఈ పాఠశాలలో ఆర్వో ప్లాంట్లను మరమత్తులు చేయించాలని ప్రిన్సిపల్ విజయసాగర్ కు సూచించారు. పాఠశాలల్లోకి చెరువు బ్యాక్ వాటర్, రాకుండా నిల్వ ఉండకుండా మందమర్రి సింగరేణి సీఎంతో మాట్లాడి మట్టి కుప్పలు పోయించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను,సబ్ కలెక్టర్ మనోజ్ ను ఆదేశిస్తున్నట్లు వెంకటయ్య తెలిపారు. పాఠశాలల్లో ఏదైనా సమస్య ఉంటే తమకు నేరుగా చెప్పాలని లేదా రాష్ట్ర కమీషన్ సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్ దృష్టికి తీసుకు రావాలన్నారు.
బాలికల పాఠశాలలో నెలకొన్న సమస్యపై స్పందించిన తాళ్ళ గురిజాల ఎస్సై రామకృష్ణను వెంకటయ్య అభినందించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు ఇప్పటి వరకు రాష్ట్రంలోని 20 గురుకుల పాఠశాలలను సందర్శించినట్లు వెంకటయ్య తెలిపారు. అనంతరం బూడిదగడ్డ బస్తీలో ఇటీవల అధికారులు అడ్డుకున్న గణేష్ మండప నిర్మాణాన్ని ఆయన పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. తాత్కాలికంగా షెడ్డు వేసుకొని గణేష్, దుర్గామాత నవరాత్రులను నిర్వహించిన ఏర్పాట్లు చేపట్టుకోవాలని అధికారుల సమక్షంలో బస్తీ వాసులకు సూచించారు.