23-09-2025 01:45:39 AM
12 మంది పెద్ద బిల్డర్లపై కేసులు పెట్టాం
గాజులరామారంలో పేదల ఇళ్లను కూల్చలేదు
హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): చెరువులు, నాలాలను కబ్జా చేస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, బడా బిల్డర్లతో తాము ఎక్కడా లాలూచీ పడలేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. చెరువులు సమాజ ఆస్తులని, వాటిని కాపాడటం తమ బాధ్యత అని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
హైడ్రా ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు రూ.50 వేల కోట్ల విలువైన 923 ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడామని వెల్లడించారు. గాజులరామారంలో ల్యాండ్ గ్రాబర్లు 300 ఎకరాలకు పైగా భూమిని అడ్డగోలుగా కబ్జా చేశారని కమిషనర్ తెలిపారు. అక్కడ 900కు పైగా ఇళ్లు ఉన్నాయి. నిన్నటి ఆపరేషన్లో 260 అక్రమ నిర్మాణాలను కూల్చి వేశాం, కానీ 640 ఇళ్లను కూల్చలేదని చెప్పా రు.
ప్రభుత్వ స్థలమని తెలియక కొందరు నిరుపేదలు ఇళ్లు కొనుక్కున్నారు. వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరిస్తున్నాం, అని ఆయన స్పష్టం చేశారు. బిల్డర్లతో హైడ్రా లాలూచీ పడిందంటూ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము ఏ బిల్డర్తోనూ రాజీపడలేదని, వర్టెక్స్, వాసవీ వంటి 12 పెద్ద బిల్డర్లపై కేసులు నమోదు చేశామని చెప్పారు. 2024 జులై 19న హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు 581 అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని, చెరువుల్లో డంపింగ్కు పాల్పడిన వారిపై 75 కేసులు పెట్టామని, 50 ఏళ్లుగా పేరుకుపోయిన కబ్జాల సమస్యను పరిష్కరి స్తున్నామని అని తెలిపారు.