17-05-2025 01:18:53 AM
82 మంది మృతిచెందినట్టు అక్కడి ఆస్పత్రివర్గాలు స్పష్టం
న్యూఢిల్లీ, మే 16: ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారింది. టెల్అవీవ్ వరుసదాడులతో గాజాపై విరుచుకుపడుతోంది. తాజాగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్, దేర్ అల్ నగర శివార్లపై వైమానిక దాడులు చేసింది. ఇందులో 82 మంది మృతిచెందినట్టు అక్క డి ఆస్పత్రివర్గాలు వెల్లడించాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్యం పర్యటనలో ఉండగానే ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడటం గమనార్హం. కాగా తాజా దాడులపై ఇజ్రాయెల్ సైన్యం ఎలాంటి ప్రకటనా చేయలేదు. బుధవారం టెల్అవీవ్ గాజాపై చేసిన దాడుల్లోనూ 70 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. తాజాగా అమెరికా మధ్యవర్తిత్వంతో హమాస్ మధ్య ఒప్పందం కుదిరింది.
దీంతో ఇరువర్గాలు బందీలను విడుదల చేస్తున్నాయి. గాజాతో యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటీవల మాట్లాడుతూ ‘గాజాలో తమ యుద్ధాన్ని ఆపడానికి ఎలాంటి మార్గం లేదు’ అని స్పష్టం చేశారు.
హుతీలు తమపై దాడులు జరపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేతన్యాహు కచ్చితంగా దెబ్బకుదెబ్బ తీస్తామని హెచ్చరిం చారు. గతంలో ఐడీఎఫ్ చేసిన దాడులను గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈసారి దాడులు మాములుగా ఉండవని.. బాంబుల మోత తో హోరెత్తుతాయని హెచ్చరించారు. దీంతో యుద్ధ విరమణ ఆశలు సన్నగిల్లాయి.