calender_icon.png 8 September, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్కింగ్ ప్రెసిడెంట్లు అవసరమా?

08-09-2025 01:44:01 AM

కాంగ్రెస్ పార్టీ పదవులపై నాయకుల్లో తర్జనభర్జన

  1. పార్టీ అధికారంలో ఉన్నందున అవసరమేంటని ప్రశ్న ఉత్పన్నం 
  2. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అవసరమనే వాదన తెరపైకి..  
  3. పీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్‌గౌడ్ ఏడాది పూర్తి 
  4. ఇంకా పూర్తిస్థాయిలో భర్తీ కానీ పీసీసీ కార్యవర్గం  
  5. ఖాళీగా పార్టీ అనుబంధ సంఘాలు, డీసీసీ పదవులు 
  6. క్యాడర్ అసంతృప్తితో స్థానికంలో తిప్పలు తప్పవంటున్న నాయకులు

హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): రాజకీయ పార్టీలు, ప్రజా సంఘా ల్లో అధ్యక్షుడి తర్వాత, వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమించడం ఆనవాయతీగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఉండేది కాదు. రాష్ట్ర విభజన తర్వాత మొదటగా కాంగ్రెస్ పార్టీయే వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాను సృష్టించింది. రాష్ట్ర విభజన తర్వాత మాజీ మంత్రి, అప్పటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్యను  పీసీసీ అధ్యక్షుడిగా నియమించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. వర్కింగ్ ప్రెసి డెంట్‌గా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నియమించింది.

అయితే, తెలంగాణ కాం గ్రెస్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులకు పుల్ స్టాప్ పెట్టాలని హస్తం పార్టీ యోచిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. అందుకు పార్టీకి చెందిన ఒక కీలక నేత అధిష్ఠానం వద్ద ప్రతిపాదన పెట్టినట్టు సమాచారం. కాగా, పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్ గౌడ్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం గతేడాది సెప్టెంబర్ 7న ప్రకటించగా, సెప్టెంబర్ 15న ఆయన బాధ్యతలు తీసుకున్నారు.

పదవి చేపట్టి ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో ఈ నెల 15న కామారెడ్డిలో భారీ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పా ట్లు చేస్తోంది. అయితే ఈ ఏడాది కాలంలో పీసీసీ చీఫ్‌గా బాధ్యతల్లో ఉన్న మహేశ్‌కుమార్ గౌడ్..  పీసీసీ కార్యవర్గాన్ని పూర్తిగా నియమించుకోలేదనే విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.

ఇటీవల పీసీసీ ఉపాధ్యక్షులు, పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవుల భర్తీని మాత్రమే చేపట్టిన ఆయన, ఇంకా పీసీసీ కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, పార్టీ అను బంధ సంఘాల కమిటీలు, డీసీసీ అధ్యక్షులతో పాటు మండల, గ్రామ స్థాయి వరకు వేలాది పదవులను పెండింగ్‌లోనే ఉన్నాయి. అంతే కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులను కూడా ఏడాదిగా భర్తీ చేయడం లేదు. 

 కాగా,   పీసీసీ వర్కింగ్ పోస్టుల భర్తీ విషయంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో  మరో వాదన వినిపిస్తోంది.  కాంగ్రెస్ పార్టీ అధికారంలో  ఉన్న రాష్ట్రాల్లో.. రాష్ట్ర కాంగ్రెస్‌కు అధ్యక్షుడు మాత్రమే ఉంటారని, వర్కింగ్ పోస్టులు ఉండవనే చర్చ జరుగుతోంది. తెలంగాణాలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున ఇక్కడ వర్కింగ్ పోస్టులు అవసరం లేదని పార్టీ అధిష్టానం పెద్దల దృష్టికి  ఒకరిద్దరు సీనియర్ నాయకులు  తీసుకెళ్లినట్లుగా గాందీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అందుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ కూడా సమ్మతంగానే  ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పార్టీ, ప్రభుత్వం మధ్య కెమెస్ట్రీ బాగానే ఉందని, ఇలాంటి సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్స్ నియామకం అవసరమా..? అనే వాదన బలంగా  వినిపిస్తోంది. తంలో  పీసీసీ చీఫ్‌గా సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నప్పుడు ప్రకటించిన వర్కింగ్ ప్రెసిడెంట్లే  ఇంకా కొనసాగుతునారు. 

సీఎం రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో  ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్, జగ్గారెడ్డి,  అజారుద్దీన్, అంజన్‌కుమార్ యాదవ్ ఉన్నారు. ముఖ్య మంత్రిగా రేవంత్‌రెడ్డి కావడంతో.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేష్‌కుమార్‌గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. మిగతా ము గ్గురు నాయకులు జగ్గారెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్, అజారుద్దీన్, గీతారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా కొనసాగుతున్నారు. 

పదవుల కోసం పోటీ ఎక్కువ..           

కాగా, ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులకు చాలా మంది నాయకులే పోటీ పడుతున్నారు. ఒకవేళ వర్కింగ్ పోస్టులను భర్తీ చేస్తే సామాజికవర్గాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతు న్నాయి. వర్కింగ్ పదవుల సంఖ్యను ఒకరు లేదా ఇద్దరని నియమించాలనే ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా బీసీ సామాజికవర్గానికి చెందిన మహేశ్‌కుమార్‌గౌడ్ ఉండగా, వర్కింగ్ పదవుల కోసం ఒక్క రెడ్డి సామాజిక వర్గం నుంచే నలుగురైదుగురు పోటీ పడుతున్నారు.

వీరిలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డికి వీరవీధేయులమని, తమకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఇస్తామని హామీ ఇచ్చారని బయట చెప్పుకుంటున్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ వర్కింగ్ పోస్టులు వస్తాయనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఒకసారి వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే.. ఆ తర్వాత పీసీసీ అధ్యక్ష పదవిని పోటీ పడటానికి అవకాశం ఉంటుందని చెప్పుకుంటున్నారు. 

ఇప్పుడు వర్కింగ్ కొడితే.. భవిష్యత్‌లో పీసీసీ పదవి

ఒకసారి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని తెచ్చుకుంటే.. భవిష్యత్‌లో పీసీసీ పదవికి లైన్ క్లియర్ ఉంటుందనే భావన కాంగ్రెస్ నాయకుల్లో ఉంది. గతంలో పొన్నాల లక్ష్మయ్య పీసీసీ చీఫ్‌గా ఉండగా, ఉత్తమ్ కుమార్‌రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేశారు. ఆ తర్వాత ఉత్తమ్ పీసీసీ అధ్యక్షుడయ్యారు. ఆ సమయంలోనే డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్క అప్పుడు సీఎల్పీ నేతగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్‌రెడ్డి, మరో ఇద్దరు కొనసాగారు.

కొంత కాలం తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తప్పించి.. పీసీసీ పగ్గాలను పార్టీ అధిష్ఠానం రేవంత్‌రెడ్డికి అప్పగించిన విషయం తెలిసిందే. రేవంత్‌రెడ్డి ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మహేశ్‌కుమార్‌గౌడ్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్, అంజన్‌కుమార్ యాదవ్ ఉన్నారు. 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రె స్ పార్టీ అధికారంలోకి రావడంతో పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కీలకంగా వ్యవహారించిన మహేశ్‌కుమార్‌గౌడ్‌కు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించారు.

మిగ తా నలుగురు ప్రస్తుతం వర్కింగ్ పదవుల్లో కొనసాగుతున్నారు. దీంతో ఇప్పుడు వర్కింగ్ పోస్టు సాధిస్తే.. భవిష్యత్‌లో పీసీసీ పగ్గాలు చేపట్టడానికి అర్హత సాధించినట్టవుతుందని పలువురు నేతలు భావిస్తున్నారు.ఈ  తరుణంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఉంటాయా? ఉండవా? అనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.