04-11-2025 04:15:37 PM
							నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని వివిధ దేవాలయాల వద్ద కార్తీక పౌర్ణమి వేడుక సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ప్రధానంగా బాసర సరస్వతి దేవి ఆలయం, తానూర్ లోని విఠలేశ్వర స్వామి ఆలయం, కదిలి పాపహరేశ్వర ఆలయం, నిర్మల్ పట్టణంలోని నగరేశ్వర స్వామి ఆలయం, దేవర కోట దేవస్థానం, వెంకటాపూర్ లోని మహదేవ ఆలయం, శివకోటి మందిరాలు వంటి ప్రధాన దేవాలయాలలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు.
ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ ఆలయాలకు వెయ్యికి పైగా భక్తులు విచ్చేస్తారని, అందువల్ల పోలీస్ శాఖ ముందస్తు చర్యలు తీసుకొని పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, పార్కింగ్ సదుపాయాలు, మహిళల భద్రతకు ప్రత్యేక సిబ్బంది, సీసీ కెమెరా పర్యవేక్షణ, పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలియ జేయడం జరిగింది.