24-10-2025 02:23:01 PM
హైదరాబాద్: హైదరాబాద్ నుండి బెంగళూరుకు ప్రయాణిస్తున్న వేటూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్(Kurnool bus accident) బస్సుకు జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది సజీవ దహనమై ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.
మరణించిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. మరణించిన వారి కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ వాసులకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున 5 లక్షల ఎక్స్ గ్రేషియా, గాయపడిన క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.