24 April, 2026 | 6:14 PM

Breaking News

నిర్మల్‌లో ఆర్టీసీ కార్మికుల మౌన ర్యాలీ   •   కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ మందుల నాగయ్య   •   ఇంటి ఆవరణ పరిశుభ్రతే... దోమల నివారణకు ఉత్తమ మార్గం   •   బిచ్కుంద మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక నోటిఫికేషన్ విడుదల   •   అర్హులైన వారికి అక్రిడేషన్ కార్డులు: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   •   ఆర్టీసీ కార్మికుడి మృతి ప్రభుత్వ హత్యగా భావించాలి   •   కాసిపేట 1A గని మ్యాన్ రైడింగ్ ప్రారంభించిన వేకటేశ్వర్లు, డైరెక్టర్ (ప్రాజెక్టు&ప్లానింగ్)   •   బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి   •   చదువుతోపాటు సంస్కారం అవసరం   •  

రైతన్నపై ఖాకీ జులుం

20-09-2025 12:23 AM
  1. యూరియా టోకెన్ల పంపిణీలో అత్యుత్సాహం
  2. ఆదిలాబాద్ జిల్లా బేలలో రైతును మోచేతితో తోసేసిన ఏఎస్‌ఐ
  3. పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం
  4. ఖమ్మం జిల్లా కారేపల్లిలో వేలాదిగా రైతుల బారులు
  5. మహబూబాబాద్ జిల్లాలో 600 టన్నుల యూరియా పంపిణీ

విజయక్రాంతి నెట్‌వర్క్, సెప్టెంబర్ 19: ఆదిలాబాద్ జిల్లాలో యూరియా పంపిణీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూరియా టోకెన్ల పంపిణీలో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఏఎస్‌ఐ ఓ రైతును మోచేతితో నెట్టేశాడు. యూరియా కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ఆదిలాబాద్ జిల్లాలోనే ఇదే పరిస్థితి ఉంది. శుక్రవారం జిల్లాలోని బేల మండల కేంద్రంలో యూరియా పంపిణీ చేస్తున్నట్టు తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది రైతులు తరలివచ్చారు.

యూరియా బస్తాలకు టోకెన్లను పంపిణీ చేసే సమయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. క్యూలైన్‌లో నిల్చున్న రైతుల వద్దకు ఏఎస్‌ఐ జీవన్ వెనుక నుంచి వచ్చారు. రైతుల సంఖ్య అధికంగా ఉండటంతో తోపులాటలో ఓ రైతు ఏఎస్‌ఐ మీద పడబోయాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఏఎస్‌ఐ ఓ రైతును మోచేతితో నెట్టేశాడు. అంతటితో ఆగకుండా రైతు పైకి మరో చేయి ఎత్తాడు. దీంతో రైతులకు, ఏఎస్‌ఐకి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు అక్కడ ఉన్నరైతులై సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.

అనంతరం రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లా కారేపల్లిలో యూరియా కోసం వేలాదిగా రైతులు బారులు తీరారు. ఐదు రోజుల నుంచి యూరియా సప్లయ్ లేకపోవడంతో.. లారీ లోడు యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు ఒక్కసారిగా తరలివచ్చారు. కారేపల్లి మండలంలోని ఆయా గ్రామాల నుంచి దాదాపు 3 వేలకు పైగా రైతులు వచ్చి కూపన్ల కోసం క్యూలైన్‌లో నిల్చున్నారు. పలుచోట్ల రైతులు మధ్య తోపులాటలు జరిగాయి. ఈ తోపులాటలో కారేపల్లి ఏవో అశోక్ కుమార్ స్పృహ కోల్పోయారు.

దీంతో ఆయన్ను దవాఖానకు తరలించారు. రైతులు కలుగజేసుకొని రైతులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్‌కు కూపన్ల పంపిణీని మార్చారు. మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం 600 టన్నుల యూరియాను సరఫరా చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల బయ్యారం, గార్ల, డోర్నకల్ తదితర మండలాల్లో పంపిణీని పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అడిషనల్ కలెక్టర్లు జిల్లావ్యాప్తంగా పర్యటించారు. రైతు భరోసా డేటా ఆధారంగా రైతులకు యూరియా పంపిణీ చేయడంతో కాస్త రద్దీ తగ్గింది. రైతులకు యూరియా ఇబ్బందులు లేకుండా చూస్తామని కలెక్టర్ భరోసానిచ్చారు.