ఇలాంటి దివాలాకోరు సీఎంను నేను ఎక్కడా చూడలే: కేటీఆర్
జూబ్లీహిల్స్ ఓటర్లు పంచ్ కొడితే.. కాంగ్రెస్ హైకమాండ్ కు తగలాలి.
కారు కావాలా.. బల్డోజర్ కావాలా.. జూబ్లీహిల్స్ ఓటరు తేల్చుకోవాలి.
హైదరాబాద్: రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారని, పేగులు మెడలో వేసుకుంటానని తరుచూ అంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) అన్నారు. ఇలాంటి దివాలాకోరు ముఖ్యమంత్రిని తాను ఎక్కడా చూడలేదని కేటీఆర్ స్పష్టం చేశారు . తనను దొంగలా చూస్తున్నారని సీఎం అంటున్నారు. గతంలో కాంగ్రెస్ తరపున ఇక్కడ అజారుద్దీన్ పోటీ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తానంటూ అజారుద్దీన్ ను పక్కకు పెట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి మోసం చేశారని కేటీఆర్ మండిపడ్డారు.
జూబ్లీహిల్స్ లో ఓటర్లు పంచ్ కొడితే ఆ దెబ్బ కాంగ్రెస్ హైకమాండ్(Congress High Command) కు తగలాలని కోరారు. కారు కావాలా.. బుల్డోజర్ కవాలా.. జూబ్లీహిల్స్ ఓటర్లు తేల్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నేతలు ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు రాయించారని కేటీఆర్ ఆరోపించారు. దొంగఓట్లను ఎదుర్కోవడంపై పార్టీ పరంగా దృష్టి సారించామని తెలిపారు. రహమత్ నగర్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్ లో జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ(Jubilee Hills Constituency) బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR), మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ, 22న నామినేషన్లు పరిశీలిస్తారు. ఈ నెల 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది. నవంబర్ 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెల్లడి కానున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత హోరాహోరీగా తలపడనున్నారు.




