రైతులు ఎవరూ అధైర్య పడకండి.. మీకు మేమున్నాం: కేటీఆర్
పత్తి రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నేరడిగొండ జిన్నింగ్ మిల్లు(Neradigonda Ginning Mill) వద్ద సోయాబీన్, మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) మంగళవారం పరిశీలించారు. అనంతరం కేటీఆర్ రైతులతో మాట్లాడుతూ... రైతులు ఎవరూ అధైర్య పడకండి, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఎల్లవేళలా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందని, రైతుల సమస్యలు పరిష్కారం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) హయాంలో రైతులకు ఎటువంటి కష్టం లేకుండా చూసుకున్నామని, ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతీ ధాన్యం గింజ కొన్నామని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జీ భూక్యా జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పర్యటనకు వెళ్లిన కేటీఆర్ కు మార్గమధ్యలో ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా, కోరుట్ల నియోజకవర్గం, మెట్ పల్లిలో… నిజామాబాద్ జిల్లా కమరపల్లిలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.






