15-09-2025 12:53:57 AM
గోపాలకృష్ణ దర్శకత్వంలో మురళీమోహన్, జయసుధ జంటగా నటించిన ‘లక్ష్మణ రేఖ’ చిత్రం విడుదలై 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుక నిర్వహించారు. చిత్ర దర్శకుడు గోపాలకృష్ణ, మురళీమోహన్, జయసుధలతోపాటు ఈ చిత్రానికి కో డైరెక్టర్గా పనిచేసిన రాజేంద్రప్రసాద్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరంతా 50 ఏళ్లు వెనక్కి వెళ్లి, అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. క్రమశిక్షణ, అంకితభావాలను లక్ష్మణరేఖలుగా మలచుకుని ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
జయసుధ మాట్లాడుతూ.. తనలోని సహజ నటిని ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం ‘లక్ష్మణ రేఖ’ అని నటి జయసుధ అన్నారు. తాను హీరోయిన్గా పరిచయమైన ఈ చిత్రానికి తన జీవితంలో ప్రత్యేక స్థానం ఉంటుందని ఆమె చెప్పారు. ఎంత మంది వారించినా తనను హీరోయిన్గా పరిచయం చేసిన దర్శకుడు గోపాలకృష్ణ అని.. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలో సీనియర్ దర్శకులు ధవళ సత్యం, పీఎన్ రామచంద్రరావు, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్, ఫిలింనగర్ కోపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు కాజా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.