02-09-2025 05:34:56 PM
అమెరికా సుంకాల ప్రభావం భారత్ లోని పలు రంగాలపై పడుతుంది.
అమెరికా సామ్రాజ్య వాదాన్ని తీవ్రంగా ఖండిద్దాం
కె బ్రహ్మచారి సిఐటియు జిల్లా అధ్యక్షులు పిలుపు
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ట్రంపు సుంకాలతో దేశాన్ని రక్షించుకుందామని, సుంకాల ఫలితం పలు రంగాలపై పెను ప్రభావం పడుతుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె బ్రహ్మచారి అన్నారు. సీఐటీయూ పాల్వంచ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అల్లూరి సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ పట్టణ కన్వీనర్ కే సత్య అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కె బ్రహ్మచారి మాట్లాడుతూ... రానున్న రోజుల్లో అమెరికా భారత దేశం పై విధించిన 50% సుంకాల ప్రభావం ఐటీ, ఫార్మా రంగాలపై చూపనుందని, ఫార్మాకు రంగానికి కేంద్రమైన ఇండియాపై యూఎస్ అదనపు సుంకాలను విధించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు రష్యా చమురును కొనుగోలు చేస్తున్నారనే సాకుతో ఇండియాపై అదనపు సుంకాలు వేయడం దారుణమన్నారు.
అమెరికా సుంకాల కారణంగా దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి పెను నష్టం వాటిల్ల నుందని అన్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని, ఆయా ఉత్పత్తులపై ఎంతమేర సుంకాల విధించారో ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో అమెరికా టారిఫ్లకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటితమై, పోరాటానికి సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు.ఇండియా పై అదనపు సుంకాలను విధించడాన్ని ఖండిస్తున్నామన్నారు.
గత సంవత్సరమ్ అక్టోబర్ నుండి గాజా,పాలస్టీనా లపై అమెరికా సహకారం తో ఇజ్రాయిల్ భీకర దాడి చేస్తున్నదని,దాదాపు 65 వేల మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు.పసి పిల్లలను కూడా చూడకుండా తిండి లేకుండా మాడ్చి చంపుతున్నారని అన్నారు.మానవ హననం జరుగుతుందని అన్నారు.అమెరికా సామ్రాజ్య వాద దాహం తీరడం లేదని అన్నారు.
ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంలో ఒక నీతిని,రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఒక నీతిని, గాజా, ఇజ్రాయిల్ యుద్ధం లో ఒక నీతి ని ప్రదర్శిస్తూ ప్రపంచ పోలీస్ పెత్తనాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రాంప్ పోషిస్తున్నాడని అన్నారు.అమెరికా విధించిన సుంకాలపై భారత దేశ ప్రధాని ధైర్యం చేసి ఒక్క మాట మాట్లాడటం లేదన్నారు. భారత దేశ 145 కోట్ల ప్రజల కోసం, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం కార్మికుల ఉపాధి కోసం భారత ప్రభుత్వం చైనా,మెక్సికో మాదిరిగా గట్టిగా ధైర్యంగా అమెరికా కి వ్యతిరేఖంగా పోరాడాలని అన్నారు. ఇటువంటి పోరాటామ్ లో ప్రజలు కూడా కలసి రావాలని పిలుపునిచ్చారు.