16-06-2025 01:44:48 AM
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సంగతి తేల్చాకే రాష్ట్రంలో స్థానిక సంస్థలు నిర్వహించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కులగణనను గొప్పగా చేపట్టామని, అది యావత్ దేశానికే రోల్ మోడల్ అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొంటున్నదని, కానీ.. ఆచరణలో మాత్రం బీసీలకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలను కాంగ్రెస్ప్రభుత్వం మోసం చేస్తున్నదని, కామారెడ్డి డిక్లరేషన్ బుట్టదాఖలు చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో 60శాతం జనాభా ఉన్న బీసీలకు కేవలం మూడు మంత్రి పదవులు ఇవ్వడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్.. తన మంత్రివర్గ కూర్పులో మాత్రం ఆ సూత్రాన్ని ఎందుకు పాటించలేదని నిలదీశారు. బీసీ మంత్రులకు ఇచ్చిన శాఖలు సైతం కీలకమైనవి కావని విమర్శించారు. బీసీల సంక్షేమం కోసం ఏటా రూ.20 వేల కోట్ల బడ్జెట్ పెడతామన్న సర్కార్.. మాట తప్పిందని ధ్వజమెత్తారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయని సర్కార్.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఓట్లు అడుగుతుందని మండిపడ్డారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లులను కేంద్ర నెట్లోకి నెట్టి, చేతులు దులపుకొని.. తెలంగాణలో మాత్రం ఎన్నికలకు సిద్ధమవుతుండడం సిగ్గుచేటన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ఢిల్లీలో మోదీని కలిసినపుడు బీసీ బిల్లులకు చట్టబద్ధతపై ఎందుకు నిలదీ యలేదని ప్రశ్నించారు. రైతులకు రైతుభరోసా ఇచ్చి, మాయ చేసి మభ్యపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టెక్కాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందన్నారు.