27-11-2025 12:00:00 AM
తెలంగాణలో రెండు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు
హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక, హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఇది కాస్త ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా గురువారం బలపడే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తెలిపింది. 48 గంటల్లో ఇది ఉత్తర తమిళ నాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ మరింత బలపడనున్నదని తెలిపింది.
మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. వాయుగుండం ప్రభావంతో గురువారం చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో 35 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని సూచించింది. మలక్కా జలసంధీ, ఇండోనేషి యాను ఆనుకుని ఉన్న సెన్యార్ తుపాను తీరం దాటిందని హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణలో మాత్రం రానున్న రెండు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 29, 30వ తేదీల్లో రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ సూచించింది.