రాజ్యాంగ పరిరక్షణ సదస్సును జయప్రదం చేయండి
ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ రాక..
బడుగు, బలహీన వర్గాల ప్రజలు వేలాదిగా తరలిరండి..
జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు.. తోటమల్ల రమణమూర్తి
భద్రాచలం (విజయక్రాంతి): జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు ఈనెల 25న భద్రాచలం పట్టణంలోని కేకే ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు తోటమల్ల రమణమూర్తి(Thotamalla Ramanamurthy) పిలుపునిచ్చారు. ఈ సదస్సులో తెలంగాణ సామాజిక ఉద్యమకారులు, తెలంగాణ నిప్పు కణిక, ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్(MLC Addanki Dayakar) హాజరవుతారని తెలిపారు. కావున ఈ సదస్సుకు వేలాదిగా బడుగు, బలహీన వర్గాల ప్రజలు భారీగా తరలిరావాలన్నారు. గురువారం రాజ్యాంగ పరిరక్షణ సదస్సు కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి మాట్లాడుతూ... భారత రాజ్యాంగం రచించి 77 సంవత్సరాలైనా 140 కోట్ల మందిని ఏకం చేస్తూనే ఉందని, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పాలనా వ్యవస్థలను నేటికీ చెక్కు చెదరకుండా కాపాడుతుందని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం ఇంత గొప్పగా ఉందంటే అది కేవలం అంబేద్కర్ జ్ఞాన శీలత, దూర దృష్టి అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుయుక్తులను తిప్పుకొట్టడానికి సమాజం ఏకం కావాలనే లక్ష్యంతో ఈనెల 25న రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో ప్రజలు వేలాదిగా పాల్గొనాలన్నారు.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ జిల్లా ఎమ్మెల్యేలు, జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, పలువురు రాష్ట్ర నాయకులు,పలు సంఘాలకు చెందిన నాయకులు,పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు,మేధావులు, విద్యావేత్తలు, అంబేద్కర్ వాదులు, పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ ఎడేళ్ల గణపతి, జిల్లా ఉపాధ్యక్షులు పల్లంటి రమేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బోడ దివ్య, మహిళా జిల్లా కార్యదర్శి మద్దేటి జయ,చర్ల మండల అధ్యక్షులు తోటమల్ల గోపాలరావు, ఐటీసీ ఉద్యోగ సంఘాల నాయకులు కొంగూరు శ్యామ్, నాయకులు కార్లపూడి సుందర్ పాల్, పప్పుల జయ, బొజ్జ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.






