24-01-2025 08:51:40 PM
ఒకరి అరెస్టు, ప్రింటింగ్ సామాగ్రి స్వాధీనం...
వివరాలు వెల్లడించిన రాచకొండ సిపి సుధీర్ బాబు..
మేడ్చల్ (విజయక్రాంతి): రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు నకిలీ నోట్ల తయారీ గుట్టు రట్టు చేశారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేయగా, ప్రింటింగ్ సామాగ్రి, ఐదు లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సిపి సుధీర్ బాబు శుక్రవారం వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కర్లీ నవీన్ కుమార్ సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లమా చేశాడు. మల్టీమీడియా, గ్రాఫిక్, వెబ్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్ లో ప్రావీణ్యం ఉంది. కొంతకాలం ఉబేర్, రాపిడో డ్రైవర్ గా పని చేశాడు. 2023 ఆగస్టులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో సులభంగా డబ్బులు సంపాదించడానికి నకిలీ నోట్లు తయారుచేసి చలామణి చేయాలని నిర్ణయించుకున్నాడు.
తయారీ విధానాన్ని ఆన్లైన్ లో వెతికాడు. ముద్రణకు 45 జిఎస్ఎమ్ పేపర్ కోసం ఇంటర్నెట్ లో వెతికి కోల్కతా నుంచి తెప్పించాడు. కర్నూలుకు చెందిన మిత్రుడు ఒకరు ప్రింటింగ్ మిషన్ కు ఆర్థిక సాయం చేయడంతో ప్రింటింగ్ మొదలుపెట్టాడు. మొదటిసారి సరిగా రాకపోవడంతో మళ్లీ థ్రెడ్ పేపర్ తెప్పించి అసలు నోట్ల మాదిరి ముద్రించాడు. వీటిని తుక్కుగూడలో చలామణి చేయడానికి ప్రయత్నించగా మహేశ్వరం జోన్ ఎస్ఓటి, పహాడీ షరీఫ్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అతని వద్ద నకిలీ 500 నోట్లు వెయ్యి పట్టుకున్నారు. నకిలీ నోట్ల ముద్రణను గుట్టు రట్టు చేసిన మహేశ్వరం ఎస్ఓటి, పహాడీ షరీఫ్ పోలీసులను సిపి అభినందించారు.