12 March, 2026 | 3:44 AM

అప్పు చెల్లించలేదని జరిపిన దాడిలో వ్యక్తి మృతి

12-03-2026 12:12 AM

చిట్యాల (నార్కెట్ పల్లి), మార్చి 11 : నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో అప్పు చెల్లించలేదని వ్యక్తిపై జరిగిన దాడిలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం  గ్రామంలో అప్పు వసూళ్ల విషయంలో సుర ఆంజనేయులు, ఓర్సు శంభు లింగం మధ్య ఘర్షణ జరిగిందన్నారు.

ఈ ఘర్షణలో శంభు లింగంకి తీవ్ర గాయాలు కాగా అతనిని హుటాహుటిన నార్కట్ పల్లి లోని కామినేని హాస్పిటల్ కి కుటుంబ సభ్యులు తరలించారన్నారు. అయితే ఛాతీలో బలమైన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ శంభులింగం (60) మృతి చెందాడన్నారు. గతంలో పెద్ద మనుషుల సమక్షంలో 80వేల రూపాయల అప్పు చెల్లించినా కూడా ఇంకా డబ్బులు వస్తాయని ఇంటికి పిలిచి సురా ఆంజనేయులు దాడి చేశాడని కుటుంభ సభ్యులు ఆరోపిస్తున్నారు.

గతంలో అధిక వడ్డీలతో ప్రజలను ఇబ్బందులు పెట్టిన విషయంలో సుర ఆంజనేయులు పై పలు కేసులు ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనతో గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకోగా పోలీసులు భారీగా మోహరించారు. గాయపరిచి మృతికి కారణమైన ఆంజనేయులు పరారీలో ఉండగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నార్కట్ పల్లి ఎస్త్స్ర విష్ణుమూర్తి తెలిపారు.