21-09-2025 12:41:06 AM
-దాని విలువ రూ.12 కోట్లు
-దుబాయ్ నుంచి వచ్చిన మహిళ అరెస్టు
-సంగారెడ్డి జిల్లాలో 166 కిలోల గంజాయి స్వాధీనం
-పోలీసుల అదుపులో ముగ్గురు
రంగారెడ్డి/సంగారెడ్డి, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి)/పటాన్చెరు/రామచంద్రాపురం: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లో శనివారం డీఆర్ఏ అధికారులు రూ.12 కోట్ల విలువ చేసే హైడ్రోపోనిక్ గం జాయిని స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి అక్రమంగా గంజాయి తరలిస్తున్నారని విశ్వసనీ య సమాచారంతో డీఆర్ఐ అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన మహిళను అనుమానించి తనిఖీ చేశారు. ఆమె రెండు బ్యాగ్లో ఆరు కిలోల చొప్పున ఆకుపచ్చ రంగులో ముద్దగా ఉన్న పదార్థాన్ని గుర్తించారు. వాటిని పరీక్షించగా అది పోనిక్ గంజా యిగా తేలింది. దీంతో మహిళను అదుపులోకి తీసుకొని, ఆమెపై కేసు నమోదు చేశారు.
రామచంద్రాపురంలో..
కారులో తరలిస్తున్న166 కిలోల పొడి గంజాయిని ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు.. ఐక్రిశాట్ ఎదురుగా ఎన్హెచ్ ముంబై జాతీయ రహదారిపై ఉన్న పాత టోల్గేట్ వద్ద శనివారం నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించారు. ఓ కారులో రూ.83 లక్షల విలువైన 166 కేజీల పొడి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రంలోని బెరంపూర్ నుండి మహారాష్ట్రకు రవాణా చేస్తుం డగా ఈ గంజాయి పట్టుబడింది. ఒడిశా రాష్ట్రం బెరంపూర్కు చెందిన అమర్ ప్రధాన్, మహారాష్ట్ర ముంబైకి చెందిన ఆటో డ్రైవర్ సయ్యద్ అలియాస్ గౌస్, లారీ డ్రైవర్ ఖాన్ షారుఖ్ఖాన్ను పోలీసులు అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సీజ్ చేసిన మత్తు పదార్థాల దహనం
సంగారెడ్డి జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన 20 కేసులలో సీజ్ చేసిన మత్తు పదార్థాలను దహనం చేసినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. శనివారం జిల్లాలోని పాశమైలారం పారిశ్రామిక వాడ మెడీకేర్ పరిశ్రమలో ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ దహనం చేసినట్టు తెలిపారు. 583 కిలోల ఎండు గంజాయి, 1.777 కిలోల ఆల్ప్రాజోలం, 980 గ్రాముల ఎండిఎంఎ కోర్టు అనుమతి తీసుకుని జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేసినట్టు వెల్లడించారు.