06-06-2025 11:27:59 PM
అధ్యక్ష బరిలో నిలిచిన అభ్యర్థి సతీష్ బాబు
మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని మార్కెట్ ఏరియా పద్మశాలి సంఘం భవన ఆధునీకరణతో పాటు, పద్మశాలి యువతకు ఉపాధి కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని పద్మశాలి సంఘం అధ్యక్ష బరిలో నిలిచిన బత్తుల సతీష్ బాబు స్పష్టం చేశారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్మశాలి కుల బంధువుల ఇంటింటికి తిరిగి తనకు మద్దతు ప్రకటించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలి యువతీ యువకుల వివాహల కోసం వివాహ పరిచయ వేదిక ఏర్పాటుకు కృషి చేస్తానని, మార్కండేయ ఆలయం నిర్మాణానికి, సంఘం అభివృద్ధికి ఆర్థిక వనరులను సమకూరుస్తానని తెలిపారు.
సంఘానికి ప్రభుత్వం నుండి నిధులు తీసుకు రావడంతో పాటు ప్రతి కుల సభ్యునికి గుర్తింపు కార్డు మంజూరు చేయించి ప్రమాదంలో గాయపడ్డ వారికి, మరణించిన వారికి ఆర్థిక సాయం అందిం చేలా కృషి చేస్తానన్నారు. ప్రతి సంవత్సరం మార్కండేయ జయంతి నిర్వహణతో పాటు, కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి, వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడంతో పాటు జాతీయ పండుగ లను ఘనంగా నిర్వహిస్తామన్నారు. అంతేకాకుండా కులస్తుల కుటుంబ తగాదాలను సంఘంలోనే పరిష్కరించేలా తనవంతు కృషి చేస్తానన్నారు. తనను ఆదరించి ఈ నెల15న జరగనున్న ఎన్నికల్లో మార్కండేయ స్వామి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.