05-04-2025 04:47:02 PM
అందుబాటులో ఆంబులెన్స్, మెడికల్ సిబ్బందిని ఉంచాలి
బీఎంఎస్ జిల్లా అధ్యక్షులు సత్తయ్య
మంచిర్యాల,(విజయక్రాంతి): వేసవి దృష్ట్యా బొగ్గు గనులపై ఆంబులెన్స్ సౌకర్యంతో పాటు మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ (బీఎంఎస్) జిల్లా అధ్యక్షులు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. శని వారం ఆర్కే న్యూటెక్ గని మీద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికుల ఆరోగ్యరీత్యా ప్రతి గని, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు, డిపార్ట్ మెంట్ లలో అంబులెన్స్ లు, పారామెడికల్ సిబ్బంది సౌకర్యం కల్పించాలన్నారు.
భూగర్భ గనులలో పనిచేస్తున్న సింగరేణి కార్మికుల ఆరోగ్య విషయంలో, గనులలో, ఓపెన్ కాస్ట్ లలో అనేక విషవాయువులు ఉంటాయని, సింగరేణి కార్మికులకు ఆరోగ్య విషయంలో పెద్ద ఎత్తున కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెప్తున్న సింగరేణి యాజమాన్యం నియమ నిబంధనలు పాటించి సౌకర్యాలు కల్పించే బాధ్యత తీసుకోవాలని, కార్మికుల ప్రాణాలను రక్షించడానికి యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవాలన్నారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని మండుతున్న ఎండల తీవ్రతను తట్టుకోవడానికి మెడికల్ నిబంధనలను పాటించాలని బీఎంఎస్ జిల్లా అధ్యక్షులు సత్తయ్య కోరారు.
గనుల మీద నాణ్యమైన మజ్జిగ ప్యాకెట్లు, ఓ ఆర్ ఆర్ ప్యాకెట్లు, కాలుష్య నివారణకు మాస్కులు, హ్యాండ్ గ్లౌజులు, ఎండ తీవ్రతను తగ్గించడానికి షెల్టర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో కార్మికుల ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.