సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ భేటీ
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో(CM Revanth Reddy) కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan ), పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరాట కార్యాచరణపై చర్చించారు. దాదాపు గంటన్నరపాటు సుదీర్ఘంగా నేతలు చర్చించారు. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 4 వరకు యథావిధిగా కాంగ్రెస్ పాదయాత్ర చేపట్టనుంది. ఆగస్టు 5,6,7 మూడురోజుల 42 శాతం బీసి రిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికై ఢిల్లీలో కార్యాచరణ, ఆగస్టు 5 న పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీల వాయిదా తీర్మానం, చర్చకు పట్టు, 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకత్వం, బీసీ సంఘాల నాయకులు పాల్గొననున్నారు. 7న రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు. ప్రత్యేక రైలులో ప్రతీ నియోజకవర్గం నుంచి 50 మంది ఢిల్లీకి పయనం కానున్నారు. ఢిల్లీ టూర్ అనంతరం కాంగ్రెస్ పాదయాత్ర యథావిధిగా కొనసాగుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి.






