18-10-2025 01:29:45 PM
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ కిరికిరి వల్లే బీసీ రిజర్వేషన్లు ఆగిపోయాయని మంత్రి సురేఖ ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(BC 42 percent reservations) కల్పించాలని డిమాండ్ చేస్తూ, రేతిఫైల్ బస్టాండ్ వద్ద నిర్వహించిన బీసీ బంద్ నిరసన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆలోచన మేరకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) చిత్తశుద్ధితో కులగణన చేపట్టి, తెలంగాణ అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదించి, వెంటనే ఆర్డినెన్స్ జారీ చేశారని మంత్రి వెల్లడించారు.
కానీ గవర్నర్ సంతకం పెట్టకుండా, బిల్లును కేంద్రానికి పంపించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం బీసీల హక్కులను అడ్డుకుందని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సాకుగా చూపిస్తూ ఎన్నికల నోటిఫికేషన్(Election notification) సమయానికి బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలు కోర్టులోకి వెళ్లి జీవోకు అడ్డుపడ్డాయని ఆరోపించారు. ఇప్పుడు అదే బీజేపీ, బీఆర్ఎస్ బీసీల కోసం రోడ్డెక్కడం విడ్డూరం ఉందని చెప్పారు. ఇది ప్రజలను మోసం చేసే రాజకీయ నాటకం తప్ప మరొకటి కాదని, బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతుతో బీసీ బంద్ కొనసాగుతోంది.