18-10-2025 04:02:34 PM
బీసీ రిజర్వేషన్లు సాధించేవరకు అండగా ఉంటా ఎమ్మెల్యే
తాండూరు,(విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల సాధనకు తాండూర్ లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ బంద్ సక్సెస్ అయింది. తెల్లవారుజామునే బిసి సంఘం నాయకులు ఆర్టీసీ బస్సు డిపో వద్దకు చేరుకొని బస్సులను రోడ్డుపైకి రాకుండా అడ్డుకున్నారు. పట్టణంలోని వ్యాపారవేత్తలు, వాణిజ్య సంస్థలు విద్యాసంస్థలు, ఆటో యూనియన్లు, ట్రేడ్ యూనియన్లు, మార్కెట్ అసోసియేషన్లు బంద్ కు పూర్తిస్థాయిలో స్వచ్ఛందంగా పాల్గొని తమ వ్యాపారాలను మూసివేశారు.
మరోవైపు బీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటూ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ సిపిఎం టీజేఎస్ తదితర అఖిలపక్షం రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. బిసి సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు అయ్యేవరకు పోరాటం కొనసాగిస్తామని, ప్రజల్లో విస్తృత చైతన్యం కలిగిస్తామన్నారు.
“బీసీ రిజర్వేషన్లు మా హక్కు – వెనక్కి తగ్గం”, “సామాజిక న్యాయం కోసం ఐక్యంగా ముందుకు” అంటూ నినాదాలు చేశారు. ఇకా మరోవైపు బస్సులు రోడ్డుపైకి రాకపోవడంతో ప్రయాణికులు తమ గమ్యస్థానంకి చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఈ బందులో బీసీ సంఘాల ప్రతినిధులు, కుల సంఘ నాయకులు, మహిళా ప్రతినిధులు, విద్యార్థి నాయకులు, యువజన సంఘాలు స్వచ్ఛందంగా పాల్గొని ఐక్యతను ప్రదర్శించారు.