25-07-2025 11:23:20 PM
సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వరంగల్,(విజయక్రాంతి): వరంగల్ నగర అభివృద్ధికి దోహదపడే మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసిందని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. భూసేకరణ నిమిత్తం 205 కోట్లు విడుదల చేస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఎమ్మెల్యే నాగరాజు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ... విమానాశ్రయ ఏర్పాటుకు సాంకేతిక అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల పరిమితిపై ఇప్పటికే కేంద్రం నుంచి అనుమతి పొందిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిధులు విడుదల చేయడం ద్వారా తన నిబద్ధతను మరోసారి చాటుకుంది అని పేర్కొన్నారు. ఎంతో గొప్ప చారిత్రక ప్రాధాన్యం కలిగిన వరంగల్ నగర అభివృద్ధిలో ఇది ఒక కీలక మైలురాయి అన్నారు. వరంగల్ ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఆకాంక్షలకు ఈ నిర్ణయం ఒక ప్రత్యక్ష సాక్ష్యం అన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా మరియు వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే నాగరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.