07-05-2024 12:09:27 AM
మొసళ్లు తిరిగే కాల్వలో తోసేయడంతో చిన్నారి మృతి
బధిరుడైన కుమారుడి విషయంలో భార్యాభర్తల నడుమ గొడవలు
భర్త వేధింపులు భరించలేక కుమారుడిని చంపిన తల్లి
బెంగళూరు, మే 6: మాటలు రాని ఆరేళ్ల బాలుడిని కన్నతల్లి కడతేర్చింది. భర్త వేధింపులు భరించలేక తన కుమారుడిని మొసళ్లు తిరిగే కాల్వలో తోసేసింది. చివరికి ఒంటి నిండా గాయాలు, ఓ చేయిలేని స్థితిలో ఆ బాలుడి మృతదేహం లభ్యమైంది. అత్యంత అమానవీయమైన ఈ ఘటన కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో చోటుచేసుకుంది. ఉత్తర కన్నడ జిల్లాలోని దండేలి తాలుకాకు చెందిన సావిత్రి (32), రవికుమార్ (36) దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వినోద్ (6) బధిరుడు కావడంతో, ఆ చిన్నారి గురించి భార్యాభర్తల నడుమ తరచూ గొడవలు జరుగుతుండేవి. అలాంటి బిడ్డను ఎందుకు కన్నావు.. అతడిని వదిలేయాలని భార్యను వేధించేవాడు.
ఇదే విషయమై శనివారం సాయంత్రం ఇద్దరి మధ్య మరోమారు గొడవ జరిగింది. దీంతో విసుగుచెందిన సావిత్రి.. తన కుమారుడిని తీసుకెళ్లి మొసళ్లు ఎక్కువగా తిరిగే కాళీ నదిలో కలిసే మురుగు కాల్వలో పడేసింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులు, గజ ఈతగాళ్ల సహాయంతో బాలుడి కోసం గాలింపు చేపట్టారు. రాత్రి కావడంతో ఆపేశారు. తిరిగి ఆదివారం ఉదయం గాలింపు చేపట్టగా ఒళ్లంతా తీవ్ర గాయాలు, ఒక చేయి కోల్పోయిన స్థితిలో బాలుడి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని భార్యాభర్తలిద్దరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు.