07-05-2024 12:09:39 AM
స్థానికేతరుడికి కీలక స్థానమా?
ఒరియా ఆత్మగౌరవానికి గొడ్డలి పెట్టు
బీజేడీపై బీజేపీవిమర్శల పర్వం
ప్రతీదీ రాజకీయం చేయొద్దని బీజేడీ కౌంటర్
లోక్సభ ఎన్నికలు రోజురోజుకూ రసవత్తరంగా సాగుతున్నాయి. ఎత్తుకు పైఎత్తుల తో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి. ఒడిశాలో ఈ సారి ఎన్నికలు కాస్త ఇంట్రెస్టింగ్గా మారాయి. ఈ ఎన్నికల్లో 400 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యం పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఒడిశాలో బీజేడీతో పొత్తు పెట్టుకోవాలి ప్రయత్నించింది. 15 ఏళ్ల కిందటి స్నేహాన్ని మళ్లీ చిగురించాలని యత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో రెండు పార్టీలు ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇక ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బీజేపీ కూడా బీజేడీపై విమర్శలకు మరింత పదును పెట్టింది. అయితే ఒరియా ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు బీజేడీకి దూరంగా ఉన్నామంటూ బీజేపీ కొత్త రాగం అందుకుంది. ఒరియా ఆత్మ గౌరవాన్ని సీఎం నవీన్ పట్నాయక్ సన్నిహితుడు వీకే పాండ్యన్కు తాకట్టు పెట్టారంటూ దుయ్యబడుతున్నారు.
వీకే పాండ్యన్ చుట్టే రాజకీయాలు
ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసినప్పటి నుంచి బీజేడీలో వీకే పాండ్యన్ కీలక వ్యక్తిగా ఎదిగారు. ఎంతగా అంటే నవీన్ పట్నాయక్కు పాండ్యన్ ఎంత చెబితే అంత. ప్రస్తుతం వీకే పాండ్యన్ కేబినెట్ హోదాలో కొనసాగుతున్నారు. తమిళనాడుకు చెందిన వ్యక్తికి ఒడిశాలో కీలక స్థానం అప్పజెప్పడంపై బీజేపీ విమర్శలు ఎక్కుపెడుతోంది. పాండ్యన్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమంటే ఒడిశా ప్రజలను కించపరిచినట్లేనని, ఒరియా భాష, సంస్కృతిని అవమానించినట్టేనని దుయ్యబడుతోంది. ఒరియా ఆత్మ గౌరవాన్ని నవీన్ పట్నాయక్ తాకట్టు పెట్టారంటూ ప్రధాని నరేంద్ర మోదీ కూడా వ్యాఖ్యలు చేశారు. ‘ఒడిశా ఆత్మ గౌరవం ప్రమాదంలో పడింది. ఒరియా భాష ప్రమాదంలో పడింది. నాకు తెలిసి ఇలాంటి పరిస్థితిని ఒడిశా ప్రజలు ఎక్కువ కాలం స్వాగతించబోరు’ అని ప్రధాని అన్నారు. స్థానికేతరుడిని ఒడిశా ప్రజలపై రుద్దడమేంటని విమర్శలు గుప్పిస్తున్నారు.