31-01-2026 02:07:35 AM
హైదరాబాద్, జనవరి 30 (విజయక్రాంతి) : పుర పోరు నామినేషన్ల పర్వం ముగిసింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు చివరి రోజు శుక్ర వారం వెల్లువలా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 2,996 వార్డులకు గాను మూడు రోజుల్లో మొత్తం 28456 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా, రెండో రోజు 7,080 మంది అభ్యర్థులు 7,403 నామినేషన్లు, మొదటి రోజు 890 మంది అభ్య ర్థులు 902 నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. శనివారం నామినేషన్ల స్క్రూట్నీ జరగనుంది.
ఇక ఫిబ్రవరి 3న విత్డ్రాకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించనుంది. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ జరగనుంది. నామినేషన్ల వేయడానికి శుక్రవారం చివరి తేదీ కావడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ, ఎంఐఎం, ఆమ్ఆద్మీ పార్టీతో పాటు స్వతంత్రులు, రిజిస్టర్ పార్టీల నుంచి అభ్యర్థులు వేలాదిగా నామినేషన్లు దాఖలు చేశారు.