21-08-2025 02:51:14 PM
పోలీస్ కమిషనర్ బి.అనురాధ
సిద్దిపేట క్రైమ్: ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నీతి నిజాయితీగా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని పోలీస్ కమిషనర్ బి.అనురాధ పోలీసులకు సూచించారు. గురువారం రాజగోపాలపేట పోలీస్ స్టేషన్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, సీజ్ చేసిన వాహనాలు, రిసెప్షన్ రికార్డ్, రూంలను పరిశీలించారు. వినాయక నవరాత్రుల సందర్భంగా వీపివోలు గ్రామాలకు వెళ్లి వినాయక మండపాల వివరాలు తెలుసుకోవాలని సూచించారు. మండపాల ఆర్గనైజర్లు కార్యవర్గ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించాలని చెప్పారు.
ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఇసుక, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, జూదం అరికట్టడానికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. కమిషనర్ వెంట సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్బి ఇన్స్పెక్టర్లు కిరణ్, మొగిలి, సీసీఆర్బి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, రాజగోపాలపేట ఎస్ఐ వివేక్, ఎస్బి ఎస్ఐ బాలకృష్ణ, రాజగోపాలపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.