17-10-2025 12:46:16 AM
హైదరాబాద్,సిటీ బ్యూరో అక్టోబర్ 16 (విజయక్రాంతి): ప్రముఖ సినీ నటుడు దగ్గుబాటి వెంకటేష్, ఆయన కుటుంబ సభ్యులకు నాంపల్లి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి డెక్కన్ కిచెన్ హోటల్ను కూలగొట్టారన్న ఆరోపణలపై నమోదైన కేసులో, నవంబర్ 14వ తేదీన తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.
కోర్టు ఆదేశాలను ధిక్కరించి, తమ స్థలంలోని డెక్కన్ కిచెన్ హోటల్ను కూలగొట్టారన్న ఆరోపణలతో దగ్గుబాటి సురేష్ బాబు, ఆయన సోదరుడు వెంకటేష్, కుమారులు రానా, అభిరామ్పై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ గురువారం నాంపల్లి కోర్టులో జరిగిం ది. వాదనలు విన్న న్యాయస్థానం, ఈ కేసు లో తదుపరి చర్యల్లో భాగంగా పర్సనల్ బాండ్ సమర్పించేందుకు నలుగురూ నవంబర్ 14వ తేదీన కోర్టులో హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ధిక్కరణకు సంబంధించిన వ్యవహారం కావడంతో న్యాయస్థానం ఈ ఆదేశాలను తీవ్రం గా పరిగణించినట్లు తెలుస్తోంది. ప్రముఖ సినీ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఒకేసారి కోర్టుకు హాజరు కావాల్సి రావడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.