01-05-2025 11:23:58 PM
యుద్ధ సంసిద్ధత, ముప్పు నివారణే లక్ష్యంగా..
ముంబై : జమ్మూ కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత నౌకాదళం అరేబియా సముద్రంలో తమ సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసింది. కొన్ని రోజులుగా అరేబియా సముద్రంలో భారత నేవీకి సంబంధించిన యుద్ధ నౌకలను హై అలర్ట్లో ఉంచారు. ఈ ప్రాంతంలో ముప్పులను నిరోధించడానికి, యుద్ధ సంసిద్ధతను ప్రదర్శించడానికి ఇటీవలే పలు యాంటీషిప్, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ ఫైరింగ్ విన్యాసాలను విజయవంతంగా పూర్తి చేసినట్టు రక్షణ వర్గాలు తెలిపాయి. ‘యుద్ధ నౌకలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. పోరాట సంసిద్ధతను చాటేందుకు, ఈ ప్రాంతంలోని సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా ఇటీవల పలుమార్లు నౌకా విధ్వంసక, విమాన విధ్వంసక అస్త్రాలను ప్రయోగించాయి’ అని పేర్కొన్నాయి. అయితే భారత్కు పోటీగా పాకిస్థాన్ నేవీ కూడా ఆ దేశ జలాల్లో ఏప్రిల్ 30 నుంచి మే 2 వరకు డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఇరు దేశాలు డ్రిల్ ప్రాక్టీస్తో భారత్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్టుగా అనిపిస్తోంది.