24-07-2025 12:00:00 AM
జహీరాబాద్, జూలై 23 : జహీరాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు అవుతున్న జాతీయ ఉత్పత్తి ఉత్పాదక సంస్థ (నిమ్జ్)ఏర్పాటు కోసం ప్రభుత్వం దాదాపు 12, 5 00 ఎకరాల భూమిని సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. రైతుల వద్ద ప్రభుత్వ, పట్టా భూములను సేకరించేందుకు రెవెన్యూ అధికారులు ఆయా గ్రామాలలో క్యాంపులు నిర్వహించారు. ఎవరెవరు భూములలో పట్టేదారులుగా ఉన్నారు? ప్రభుత్వ భూమిలో ఎవరెవరు ఎంతెంత భూమిని కాస్తు చేస్తున్నారని వివరాలను సేకరించారు.
దీంతో బర్దిపూర్ గ్రామంలో సర్వే నంబర్ 16లోని ప్రభుత్వ భూమిలో గ్రామానికి చెందిన యోహాన్ అనే వ్యక్తి మూడు ఎకరాలు పట్టిదారుగా ఉండి కాస్తూ చేసి జీవనం గడుపుతున్నాడు. ఈ సర్వే నంబర్ లో ప్రభుత్వం భూమిని సేకరించింది. అందులో యోహాన్కు చెందిన భూమి కూడా ఉంది. కానీ ఇప్పటివరకు యోహానుకు నయా పైసా కూడా నష్టపరిహారాన్ని అధికారులు అందజేయలేదు.
ఈ సర్వే నంబర్లో ప్రభుత్వం రైతులకు సాగు చేసుకునేందుకు అసైన్మెంట్ ద్వారా భూములను అందజేసి పట్టా పాస్ బుక్కులు కూడా ఇచ్చారు. తదనంతరం జరిగిన పరిణామాలతో ఈ సర్వే నంబర్ మొత్తం నిమ్జ్ ఆధీనంలోకి వచ్చింది. దీంతో రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకులు పకడ్బందీ వ్యూహంతో ప్రభుత్వ ధనాన్ని కాజేసేందుకు పావులు కలిపారు.
ప్రభుత్వ భూమికి నకిలీ పాస్ పుస్తకాలు...
ప్రభుత్వ భూమి లావుని పట్టా కింద 215 ఎకరాల నష్టపరిహారం ఇచ్చేందుకు అధికారులు రికార్డులు తయారు చేశారు. అందులో ప్రభుత్వానికి చెందిన భూమిని రాత్రికి రాత్రే అప్పటి తహసిల్దార్, కొందరు రాజకీయ నాయకులు కలిసి బినామీ పేర్లతో పట్టా పాస్ బుక్కులను తయారుచేసి నష్టపరిహారాన్ని కాజేశారు.
ఇందులో యోహాన్కు చెందిన మూడు ఎకరాల భూమికి బదులు రెండు ఎకరాల భూమికి సంబంధించిన నష్టపరిహారం ఇచ్చేందుకు అధికారులు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ భూసేకరణ జహీరాబాద్ లేక సంఖ్య నంబర్ 33 నిమ్జ్ 2017 ప్రకారం యోహానుకు మూడు ఎకరాల భూమి ఉండగా రెండు ఎకరాల నష్టపరిహారం ఇచ్చేందుకు అధికారులు సన్నద్దమయ్యారు.
దీంతో యోహాన్ తనకు మూడు ఎకరాల లావుని పట్టా ఉంది కాబట్టి మూడు ఎకరాలకు సంబంధించిన నష్టపరిహారం ఇవ్వాలని అధికారులను కోరారు. అయినప్పటికీ అధికారులు గ్రామంలో ఉన్న అందరికీ సర్దుబాటు చేశామని చెప్పడంతో యోహాన్ నష్టపరిహారాన్ని తీసుకునేందుకు నిరాకరించాడు. మూడు ఎకరాలకు సంబంధించిన నష్టపరిహారం ఇస్తేనే తీసుకుంటా నని చెప్పడంతో అధికారులు ఏమీ చేయలేకపోయారు.
మూడు ఎకరాల భూమి కబ్జాలో ఉందో లేదో చూడాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ను ఆదేశించగా ఆయన సర్వేలతో కలిసి వెళ్లి సర్వే చేయగా మూడు ఎకరాల భూమి యోహాన్ కబ్జాలో ఉన్నట్లు తేల్చారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకుండా ఇప్పటివరకు నయా పైసా కూడా లబ్ధిదారునికి అందించకపోవడంతో ఆయన మళ్లీ తన మూడు ఎకరా భూమిలో కంది పంటను వేసి సాగు చేసుకుంటున్నాడు.
కొందరు రైతులు లావుని పట్టా కలిగి ఉన్నా ఎకరాల కంటే ఎక్కువగా కబ్జాలో ఉన్నప్పటికీ అట్టి భూమిని తీసుకొని నష్టపరిహారం ఇవ్వకుండా ఇతరుల పేరుపై పట్టా పాసుబుక్కులు సృష్టించి ప్రభుత్వ ధనాన్ని కాజేశారు. ఏది ఏమైనప్పటికీ నిమ్జ్ నష్టపరిహారంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు తొవ్వినకొద్దీ బయటపడుతున్నాయి.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ భూమిపై పట్టా కలిగిన వ్యక్తుల వివరాలను ఏ సమయంలో అసైన్మెంట్ కమిటీ ద్వారా ఇచ్చారో.. బోగస్ గా ఇచ్చిన పాసుబుక్కులను పరిశీలించాలని, తమ ఆధీనంలో ఉన్న భూమికి తమకే నష్టపరిహారం ఇవ్వాలని రైతులుకోరుతున్నారు.