06-01-2026 01:18:28 AM
కామారెడ్డి అర్బన్, జనవరి 5,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండ లంలో ఫార్మా కంపెనీని నెలకొల్పడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని స్థానిక యువకులు అన్నారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలో సమావేశమయ్యారు. అనంతరం భిక్కనూరులోని గాంధీ చౌక్ వద్ద నినాదాలు చేశారు.
కంపెనీకి వ్యతిరేకంగా తీర్మానం..
బిక్కనూరు మండలంలో ఫార్మా కంపెనీని ఏర్పాటును వ్యతిరేకించాలని యువకులంతా తీర్మానం చేశారు. ఈ తీర్మానం మేరకు ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ‘ఫ్యాక్టరీ వద్దు.. భిక్కనూరు ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. ఫార్మా కంపెనీల వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా ఫార్మా కంపెనీని అడ్డుకోవాలని వారు ఈ సందర్భంగా నినదించారు.
7న భిక్కనూరు బంద్..
ఈనెల 7వ తేదీన భిక్కనూరు మండలంలో నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నిరసనగా 7న బంద్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.