25-07-2025 12:00:00 AM
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
ఆందోల్(సంగారెడ్డి), జూలై 24(విజయక్రాంతి): రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గురువారం అందోల్ ,చౌటకూర్ మండలాలలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా అందోల్, చౌటకూర్ మండలాలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. చోటకూర్ మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణాలకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి స్థల పరిశీలన చేశారు.
అనంతరం సుల్తాన్ పూర్ జేఎన్టీయూ కళాశాలలో ప్రహరీ గోడ నిర్మాణం పనులు తనిఖీ చేశారు. కళాశాలలో అతని ఆడిటోరియం 200 అడుగుల టవర్, సైన్స్ ల్యాబ్ లు నిర్మాణంలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. మంత్రి సహకారంతో విద్యార్థులకు అందించిన 100 సైకిళ్లను మంత్రి పరిశీలించారు. మంత్రి స్వయంగా సైకిల్ నడిపి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. అనంతరం జోగిపేటలో నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కళాశాల పనులను పరిశీలించారు పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
చౌటకూర్ మండలంలోని ఒక హోటల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రి సమావేశం అయ్యారు ఈ సందర్భంగా మంత్రి హోటల్ వంటగదిని ఆకస్మికంగా పరిశీలించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు తప్పకుండా పాటించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జోగిపేట ఆర్డిఓ పాండు, మండల రెవెన్యూ అధికారులు, ఇంజనీరింగ్ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.