28-11-2025 12:53:48 AM
- ఎన్నికల పరిశీలకులు రవి
- జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి నామినేషన్ సేకరణ కేంద్రాల పరిశీలన
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),నవంబర్27: పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా, శాంతియుత వాతావరణంలో జరపాలని జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు రవి అన్నారు.జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్,జిల్లా ఎస్పీ కే నరసింహలతో కలిసి గురువారం మండల కేంద్రం అర్వపల్లి లోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పం,వార్డు సభ్యుల ఎన్నిక నిమిత్తం ఏర్పాటు చేసిన నామినేషన్ సేకరణ కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్లకు అవగాహన కల్పించి తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకొని,ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొనేలా చూడాలని అన్నారు.ఓటర్లకు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.అనంతరం కలెక్టర్,ఎస్పీలు మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని,అభ్యర్థుల ఖర్చులు లెక్కించుటకు ఫ్లయింగ్ స్క్వాడ్,స్టాటిక్ టీంలు నిరంతరం పర్యవేక్షణ చేస్తాయని,పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసు శాఖ నామినేషన్ కేంద్రాల వద్ద,పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కొరకు బలగాలను ఏర్పాటు చేశామని అన్నారు.ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధమైన చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు,డీఎస్పీ రవీందర్ రెడ్డి,జెడ్పి సీఈఓ అప్పారావు, డీపీఓ యాదగిరి, డీఎల్ఫీఓలు నారాయణరెడ్డి,పార్థసారథి, ఎంపీడీఓ ఝాన్సీ, తహసీల్దార్ శ్రీకాంత్,ఎంపీఓ గోపి,నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.