28-11-2025 12:00:00 AM
-నేటి నుండి 44వ తెలంగాణ అండర్ 14 బాలబాలికల ఛాంపియన్షిప్
-ఎమ్మెల్యే జీఎంఆర్ ఆధ్వర్యంలో క్రీడల నిర్వహణ
పటాన్చెరు, నవంబర్ 27 :రాష్ట్ర స్థాయి క్రీడలకు పటాన్చెరు పట్టణం మరోసారి వేదికగా నిలవనుంది. పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మాదానం వేదికగా నేటి నుండి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు 44వ తెలంగాణ అండర్ 14 ఖో ఖో బాలబాలికల అంతర్ జిల్లాల చాంపియన్షిప్2025 పోటీలు జరగనున్నాయి. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సౌజన్యంతో ఖో ఖో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో క్రీడ పోటీలు జరగనున్నాయి.
ఈ మేరకు గురువారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మైత్రి మైదానంలో క్రీడల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. 33 జిల్లాల నుండి తరలివచ్చే క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి సదుపాయంతో పాటు అల్పాహారం, భోజనం సదుపాయాలను సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
ఏడాది పొడుపున వివిధ క్రీడల్లో రాష్ట్ర, జాతీయ పోటీలకు పటాన్చెరు మైత్రి మైదానాని వేదికగా నిలుపుతున్నామని తెలిపారు. కోకో క్రీడకు మరింత ప్రాచుర్యం అందించేలా రాష్ట్రస్థాయి పోటీలు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోకో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు హరి కిషన్, కార్యదర్శి శ్రీకాంత్, పటాన్చెరు సిఐ వినాయక రెడ్డి, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.