21-10-2025 04:04:08 PM
ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్క్వార్టర్స్లో సోమవారం నిర్వహించిన పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవంలో జిల్లా ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్నగర్ డీఎస్పీ వాహీదుద్దీన్, పోలీసు ఉన్నతాధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులతో కలసి పాల్గొన్నారు. ముందుగా ఏఎస్పీ గౌరవ వందనం స్వీకరించి, జ్యోతి ప్రజ్వలనం చేశారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ చిత్తరంజన్ మాట్లాడుతూ... అక్టోబర్ 21వ తేదీని దేశవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల దినంగా జరుపుకుంటాం. ప్రజల భద్రత కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు సిబ్బంది త్యాగాలు అపారమైనవి. వారిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు.కాగజ్నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్ అమరులైన పోలీసు సిబ్బంది పేర్లను చదివి వినిపించారు. అనంతరం అమరవీరుల స్మారక స్తూపం వద్ద పోలీస్ అధికారులు పుష్పగుచ్ఛాలు సమర్పించి, రెండు నిమిషాల మౌనం పాటించారు.