అత్యవసర సమయంలో పోలీసు సేవలను వినియోగించుకోవాలి
జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే..
జయశంకర్ భూపాలపల్లి/మహబూబాబాద్ (విజయక్రాంతి): భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు ఏదైనా ఆపద సంభవిస్తే వెంటనే 100 కు డయల్ చేయాలని, అలాగే 8712658129 కు సమాచారం ఇస్తే పోలీసులు తగిన సహాయం అందజేస్తారని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే(District SP Kiran Khare) తెలిపారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భూపాలపల్లి జిల్లా పరిధిలో ఉన్న ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇతర చోట్లకు ప్రయాణం చేయకూడదని కోరారు. ప్రమాద కారణాల దృష్ట్యా చెరువులు కుంటలు ఇతర ప్రదేశాలకు వెళ్లకూడదని, రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ స్తంభాలను, తీగలను తాకవద్దని సూచించారు. వరద ఉధృతి ఉన్న సమయంలో వాగులు దాటేందుకు ప్రయత్నించకూడదని, పాత భవనాలు, శిథిలావస్థలో ఉన్న ఆవాస ప్రాంతాల్లో నివాసం ఉండకూడదని ఎస్పీ కోరారు.






