23-07-2025 11:15:14 PM
డబుల్ బెడ్ రూములు ఇప్పిస్తానని పేదల నుంచి లక్షల రూపాయలు దండుకున్న హరిబాబు..
రమేష్ అనే బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు..
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వేదికగా, పేదలకు డబుల్ బెడ్ రూములు ఇళ్ళు ఇప్పిస్తామని బురిడీ కొట్టించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కెపి. వివేకానంద్(MLA KP Vivekanand) క్యాంపు కార్యాలయంలో పనిచేసే హరిబాబు పేదలను లక్ష్యంగా చేసుకొని దోపిడీకి పాల్పడ్డాడని, ఈ స్కాములో 83 మంది బాధితులు ఉన్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పనిచేయడం అదునుగా భావించి, సొంతింటి ఇల్లే కలగా ఎదురుచూస్తున్న వారిని ఎరగా ఎంచుకొని వారినుండి 84 లక్షల వరకు వసూలు చేసినట్లుగా బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకే ఎమ్మెల్యే వివేకానంద్ క్యాంపు క్యారాలయంలో పనిచేసే హరిబాబును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని అన్నారు. ఇదే డబుల్ బెడ్ రూముల స్కాములో మరో వ్యక్తి గడ్డం శ్రీధర్ ముదిరాజ్ పై సైతం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.