13-08-2025 03:27:36 PM
నాలుగో రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ నాలుగో రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ నాయకులు పిలుపునిచ్చారు. సీపీఐ బెల్లంపల్లి పట్టణ కార్యాలయంలో బుధవారం సీపీఐ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభల గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య మాట్లాడుతూ... భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాల సుదీర్ఘకాలంలో ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిoదన్నారు. పీడిత ప్రజలు, కార్మికుల హక్కుల కోసం అనేక ఉద్యమాలు జరిపిందని తెలిపారు.
ఈ పోరాటాలతోనే ప్రైవేటు రంగ బ్యాంకులు జాతీయం అయ్యాయన్నారు. ప్రజలకు జీవించే హక్కు గురించి ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉందని తెలిపారు. తెలంగాణ నైజాం నవాబుకు, పెత్తందారు వ్యవస్థకు, దొరల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, దున్నేవాడికే భూమి కావాలని మహోన్నతమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. లక్షలాది ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిపెట్టిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉన్నదనీ పునరుద్ధాటించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వేలాది మంది కమ్యూనిస్టులు నెలకొరిగారన్నారు. ఇంతటి మహోన్నతమైన చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీ నాలుగోవ రాష్ట్ర మహాసభలు మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో జరుగుతున్నారు.