03-01-2026 12:43:38 AM
తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలపై అసెంబ్లీలో చర్చ
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తీవ్ర నష్టం జరిగిందని సర్కార్ విమర్శ
హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): నదీ జలాల అంశం, పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టు, కృష్ణా జల్లాల్లో తెలంగాణ వాటాపై అసెంబ్లీలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్(పీపీపీ) ఇవ్వనుంది. ఉమ్మడి రాష్ట్రంలో, రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రజలకు వివరించనున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలోనే కృష్ణానదీ జలాల్లో తెలంగాణకు తీవ్రనష్టం జరుగుతోందని మాజీ సీఎం కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, కృష్ణా నీటి వాటాలో రాష్ట్రానికి 299 టీఎంసీల నీరు సరిపోతుందని కేసీఆర్ సంతకం చేశారని రేవంత్రెడ్డి, మంత్రులు ఆరోపిస్తున్నారు. ఈ పీపీపీకి ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ హాజరవుతుందా..? లేదా అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం రావడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శుక్రవారం వాకౌట్ చేసి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నావలి ఉంటుంది.