15-09-2025 12:00:00 AM
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 14: ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్లో సమస్యలు తిష్ట వేశాయి. ప్రతి నిత్యం మార్కెట్ కు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లోని వివిధ గ్రామాల నుంచి ర కపోకలు సాగిస్తుంటారు. దురా ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు కనీస అవసరాలను తీర్చుకొనే టాయిలెట్స్, మంచినీటి వసతి సౌకర్యాలు వినియోగంలేకుండా పొయ్యాయి.
ప్రతి యేటా లక్షల్లో ఆదాయం వస్తున్న .... కానీ మార్కెట్లో వసతి సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం మార్కెట్కు వచ్చే రైతులకు వసతి సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు ఉన్న... మార్కెట్ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో మార్కెట్కు వచ్చే రైతులు నిత్యం అవస్థలు పడాల్సి వస్తుంది. బహిరంగ ప్రదే శాల్లో మలమూత్ర విసర్జన చేయడం అనాగరికం.
కాదని ఆ పని చేస్తే జరిమానా విధించడును, మనం మారుదాం.. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం అనే నినాదాలు గోడలపై రాతలే తప్పా, ఆచరణలోకి రావడం లేదు అనడానికి ఇక్కడి సమస్య నిదర్శనమని చెప్పవచ్చు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని వ్యవసాయ మార్కేట్ లో 2016 లో రూ.10 లక్షలతో టాయిలెట్స్ బ్లాక్స్ చేపట్టారు. కొంతకాలం పాటు రైతులకు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం నీటి సౌకర్యం, సరైన నిర్వహణ లేకపోవడంతో ప్రస్తుతం నిరుపయోగంగా మారింది.
దీంతో, నిత్యం మార్కేట్ కు వచ్చే వేల సంఖ్యలో రైతులు, క్రయవిక్రయదారులకు అత్యవసర పరిస్థితుల్లో మలమూత్ర విసర్జన విషయంలో ముఖ్యంగా మహిళలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్ కు కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా, మార్కేట్ లో మరుగుదొడ్లు, సరైన వసతులు లేక, తప్పని పరిస్థితుల్లో బహింగ ప్రదేశాల్లోనే పని కానిచ్చేస్తునారు.
అయితే ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కేట్ కు వచ్చే ఆదాయం మెండుగా ఉన్నప్పటికీ, ఇక్కడికి వచ్చే రైతులకు త్రాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం లేక నానా అవస్థలు పడాల్సి వస్తుంది. చాలా కాలంగా ఉన్న ఈ సమస్యపై అధికారులు స్పందించకపోవడం బాధకరమని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి రైతులకు, క్రయావిక్రయదారులకు మంచి నీటి సౌకర్యంతో పాటు మరుగుదొడ్లు వినియోగం లోకి తీసుకురావాలని కోరుతున్నారు.
కోట్ల ఆదాయం వస్తున్నా.. సౌకర్యాలేవి?
పాలకవర్గం మార్కెట్ ఆవరణలో అదనంగా నూతన మడిగెలు, సీసీ రోడ్డు నిర్మించడంతో మార్కెట్ కు నూతన ఒరవడిని. ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్కు సంబంధించిన 68 మడిగెలు(51 పాతవి+17 కొత్తవి), పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చిన 2 గోడౌన్ల, 34 రైస్ మిల్లులు, 2 నెయ్యి ప్రాసెసింగ్, 3 ఆయిల్ మిల్లులు, 2 మొక్కజొన్న ప్రాసెసింగ్, 19 మంది ట్రేడర్స్ నుంచి ప్రతి ఏటా కోట్ల రూపాయల ఆదాయం ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కు చేకూరుతున్నా మార్కేట్ లో మాత్రం సరైన వసతులు కల్పించడంలో అధికారులు విఫలం అవుతున్నారని రైతులు వాపోతున్నారు.
ప్రమాదకర స్థితిలో నీటి ట్యాంక్......
మార్కెట్ కు వచ్చే రైతులు, క్రయవిక్రయదారులు, సివిల్ సప్లై గోడౌన్ హమాలీ కూలీలు, ఇతరులు ఉపయోగించే (త్రాగేందుకు యోగ్యం కానీ) నీటి ట్యాంక్ శిథిలావస్థలో, ప్రమాదకర స్థితిలో ఉన్నది. ఎప్పుడు కూలుతుందో అనేలా మారింది. ఇక్కడ నీటిని వాడుకునే క్రమంలో నీటి ట్యాంక్ కూలినట్లయితే ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నది. కావునా ప్రమాదం జరగక ముందే మరమత్తులు వంటి చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
మార్కెట్లో సమస్యలను పరిష్కరించాలి..
నూతనంగా సీసీ రోడ్డు, మడిగెలు ఏర్పాటయ్యాకా వాహనాలు, రైతులు, పలు కాలనీల ప్రజలు, విద్యార్థులు ఈ మార్కెట్ దారిలో ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్నారు. కానీ చాలా రోజుల నుంచి మార్కెట్లో త్రాగునీరు, మరుగుదొడ్ల సమస్య ఉన్నది. సరైన టాయిలెట్స్ లేకపోవడంతో బహిరంగ విసర్జన విషయంలో ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు తప్పడంలేదు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలి.-
- మంకు ఇందిరా, మాజీ ఎంపీపీ, మంచాల.
పరిష్కారానికి కృషి చేస్తా..
మార్కెట్లోనీ సమస్యలు మా దృష్టికి వచ్చిన విషయం వాస్తవమే. ఇదివరకు, పాడైన కూరగాయలు మార్కెట్ యార్డులోనే డంపు చేస్తున్న కారణంగా దుర్గంధం వెదజల్లేది, దీంతో పందులు, దోమల బెడద పెరగడంతో మున్సిపల్ అధికారుల సాయంతో ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నాం. మిగతా సమస్యలను కూడా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా
-సంతోష్ కుమార్, సెక్రటరీ,
ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్.