16-10-2025 05:07:25 PM
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆర్ధిక ఆసరాను వెంటనే అందించాలి..
నిర్మాణాల పురోగతిని ఆన్లైన్ లో వెంటనే నమోదు చేయాలి..
మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..
పాపన్నపేట (విజయక్రాంతి): నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ ధాన్యం కొనుగోళ్లు జరగాలని, దశల వారీగా జరిగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబందించిన బిల్లులు వెంటనే లబ్ధిదారులకు అందేలా క్షేత్ర స్థాయిలో అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం పాపన్నపేట మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. ఆలస్యం లేకుండా ఎప్పటికప్పుడు కొనుగోళ్లు జరగాలని, ఏ కేంద్రంలోనూ ఎలాంటి సమస్య రాకూడదని అధికారులను ఆదేశించారు.
తేమ శాతాన్ని సరిగ్గా నిర్దారించాలని, కొనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు. కొనుగోలు కేంద్రలాలో సమస్యలు ఏమైనా ఎదురైతే తమ దృష్టి కి తీసుకవస్తే, పరిష్కరిస్తామని అక్కడ ఉన్న రైతులకు కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన ధాన్యం వివరాలు, గన్ని సంచులకు సంబందించిన వివరాలు, రిజిస్టర్ లను, ఆన్లైన్ ప్రక్రియ ను ఈ సందర్బంగా కలెక్టర్ పరిశీలించారు. నాణ్యతగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరగాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పొడిచిన్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో ఉన్న వారికి బిల్లులు సకాలంలో అందించాలన్నారు. ఆయన వెంట అధికారులు, సిబ్బంది ఉన్నారు.