26-04-2025 12:00:00 AM
అదనపు కలెక్టర్ దీపక్ తివారి
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు.శుక్రవారం మండలంలోని అడదస్నాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో ఆధునిక సౌకర్యాలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేస్తుందని, నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం త్రాగునీటి వనరుల లభ్యతను నీటి నాణ్యతను పరిశీలించారు.వేసవికాలంలో ప్రజలకు ఎలాంటి త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నీటి కొరత ఉన్న ప్రాంతాలలో అవసరమైనతే కొత్త బోరు బావులు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, నీటి సరఫరా శాఖ ఇంజనీర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.