17-12-2025 12:00:00 AM
భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు
హుజూర్ నగర్ డివిజన్లో 2.10 లక్షల ఓటర్లు
ఏడు మండలాలలో 146 గ్రామపంచాయతీలు
1176 పోలింగ్ స్టేషన్లు
22 సర్పంచులు ఏకగ్రీవం
తేలనున్న 124 సర్పంచ్ల భవితవ్యం
హుజూర్ నగర్, డిసెంబర్ 16: హుజూర్ నగర్ నియోజకవర్గం లోని ఏడు మండలాలలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేశారు.జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ డిసిఆర్ కేంద్రాలను పరిశీలించి ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కౌంటింగ్ ప్రారంబిం చనున్నారు.
హుజూర్ నగర్ డివిజన్ లోని చింతలపాలెం, మేళ్లచెర్వు, హుజూర్ నగర్, మఠంపల్లి,గరిడేపల్లి,నేరేడుచర్ల, , పాలకవీడు మండలాలు ఉన్నాయి. ఈ ఏడు మండలాలలో మొత్తం 124 గ్రామపంచాయతీలకు 1118 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.ఇప్పటికే 22 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.మిగలిన 124 పంచాయతీల్లో ఎన్నికలను అధికారులు నిర్వహించనున్నారు. ఇప్పటికే హుజూర్ నగర్ డివిజన్ లోని ఎన్నికల సామగ్రిని పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఎన్నికల సామాగ్రిని పంపిణీ కేంద్రాలకు తరలించారు.
డివిజన్ లో 1176 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హుజూర్ నగర్ డివిజన్ లో ఏడు మండలాల్లో మూడు రోజుల ముందు నుంచే డబ్బులు, మద్యం, మాంసం, పంపిణీ చేస్తు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.వివిధ గ్రామాల్లో జనరల్ స్థానాల్లో విపరీతమైన పోటీ ఉన్నందున పోటీ చేసిన అభ్యర్థులు ఆర్థికంగా, అంగబలం కలిగిన నాయకులై ఉండి ఈ పంచాయితీ ఎన్నికల్లో ఆయా గ్రామపంచాయతీలో జనాభాను బట్టి రూ.30 లక్షల నుండి రూ.50 లక్షల మధ్య డబ్బును ఖర్చు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విధులు నిర్వహించే అధికారులు: హుజూర్ నగర్ డివిజన్లో ఎన్నికలలో విధులు నిర్వహించే అధికారులు స్టేజ్ వన్ ఆర్వోలు 45 మంది, స్టేజ్ టు ఆర్వోలు 147 మంది,పోలింగ్ ఆఫీసర్లు 1538, ఓపివోస్ 2026 ఎన్నికల విధులు నిర్వహించనున్నారు.