08-05-2025 12:00:00 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, మే 7 (విజయక్రాంతి): ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కుంటాల మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కుంటాల మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ రికార్డులలో పేరు, విస్తీర్ణం లోపా లు, వారసత్వ భూములు, నిషేధిత జాబితా లో భూములు, సాదాబైనామాలు, హద్దుల తగాదాలు తదితర సమస్యల పరిష్కారానికి ఈ సదస్సులు ఉపయోగపడుతున్నాయని వివరించారు.
రెవెన్యూ సదస్సుల ద్వారా రైతులతో ముఖాముఖి చర్చించి సమస్యలు తెలుసుకుంటున్నామని, ప్రతి దరఖాస్తుకూ రశీదు ఇవ్వాలని, సత్వర విచారణ అనంత రం తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం సమీపంలోని జొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదన పు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ కోమల్రెడ్డి, రెవెన్యూ ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్, సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.