21-09-2025 12:32:20 AM
పాల్గొన్న డివిజన్ పోలీస్ అధికారులు
తూప్రాన్,(విజయక్రాంతి): తూప్రాన్ డీఎస్పీ ఆగస్టు నెల క్రైమ్ రివ్యూ సమావేశాన్ని సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు ఎస్హెచ్ఓలతో కలసి నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ నేరాలపై సమీక్ష జరిపి, భవిష్యత్ లో తీసుకో వాల్సిన చర్యలపై ముఖ్యమైన సూచనలు చేశారు. డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ విచారణలో ఉన్న కేసులు, న్యాయ స్థానాల్లో ట్రయల్ పెండింగ్లో ఉన్న కేసులు, నాన్ బైలబుల్ వారెంట్లను త్వరితగతిన తగ్గించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరిగా పూర్తి చేయాలని, ఇవి నేరాలను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అలాగే గంజాయి, జూదం ఇతర అక్రమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని, ఇలాంటి వాటిని నిరోధించడానికి పహారా బలపరచాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.