calender_icon.png 29 September, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్‌పై సవారీ

29-09-2025 01:37:05 AM

ఫైనల్‌లో దాయాదిని చిత్తు చేసిన భారత్

  1. తొమ్మిదోసారి ఆసియాకప్‌ను సొంతం చేసుకున్న టీమిండియా

ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం

తిప్పేసిన స్పిన్నర్లు, తడబడ్డా నిలబడ్డ బ్యాటర్లు

సత్తా చాటిన హైదరబాదీ తిలక్ వర్మ

ఫైనల్‌లోనూ పాక్ ప్లేయర్ల ఓవరాక్షన్

దుబాయ్, సెప్టెంబర్ 28: దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్  డిఫెండింగ్ చాంపియన్ భారత్ దాయా ది పాకిస్థాన్‌ను ముచ్చటగా మూడోసారి మట్టి కరిపించింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలిచి సూర్య సేన తొమ్మిదోసారి ఆసియాకప్‌ను కైవసం చేసుకుంది. ఈ టోర్నీ ఆసాంతం సూర్య సేనకు ఓటమనేదే ఎదురుకాలేదు. ఇప్పటికే పాక్‌ను గ్రూప్ స్థాయితో పాటు సూపర్ పోరులో మట్టి కరిపించిన సూర్య సేన ఫైనల్‌లోనూ వదలలేదు.

టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారం భం లభించకపోయినా మిడిల్ ఓవర్స్‌లో స్పిన్నర్లు పాక్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశారు. పాక్‌తో మ్యాచ్‌లంటే రెచ్చిపోతున్న చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఫైనల్ మ్యాచ్‌లోనూ నాలుగు వికెట్లు కూల్చి పాక్ నడ్డి విరిచాడు. కుల్దీప్‌కు తోడు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా తలా రెండు వికెట్లతో పాక్ మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్‌ను పెవిలియన్‌కు పంపారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌కు ఓపెనర్లు ఫర్హాన్ (57), జమాన్ (46) 50+ పార్ట్‌నర్‌షిప్ అందజేశారు. పవర్‌ప్లేలో పాకిస్థాన్ వికె ట్‌లెస్‌గా 45 పరుగులు చేసింది. పవర్‌ప్లే ముగిసిన తర్వాత కూడా పాకిస్థాన్ ఓపెనర్లు వికెట్లు ఇవ్వకుండా భారత బౌలర్లకు పరీక్ష పెట్టారు.

ఎట్టకేలకు 10వ ఓవర్లో  మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఓపెనింగ్ జోడీని విడదీశాడు. ఇక తొలి వికెట్ లభించిన తర్వా త మన బౌలర్లు రెచ్చిపోయారు. వరుస వి రామాల్లో వికెట్లు నేలకూలుస్తూ పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. మొదటి ముగ్గురు బ్యాటర్లు తప్ప మిగతా ఏ బ్యాటర్లు కూడా రెండంకెల స్కోర్ చేయపోవడం గమనార్హం. మ్యాన్ ఆఫ్ ది ఫైనల్‌గా తిలక్ వర్మ నిలిచాడు. 

పాక్ బ్యాటర్లు పటపటా..

పవర్‌ప్లేలో లభించిన శుభారంభాన్ని పాకిస్థాన్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఓపెనర్ ఫర్హాన్ అర్ధ సెంచరీ చేసి ఔటైన తర్వాత వచ్చిన సయీమ్ ఆయుబ్ (14) మినహా ఏ ఒక్క బ్యాటర్ కూడా రెండంకెల స్కోరు నమోదు చేయలేదంటే పాక్ ఇన్నింగ్స్ ఎంత దారుణంగా సాగిందో ఇట్టే అర్థం అవుతుంది.

ఒక్కరని కాకుండా భారత బౌలర్లంతా పాక్ పతనంలో తలో చేయి వేశారు. 17వ ఓవర్ వేసిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కేవలం ఒకే ఒక రన్ వైడ్ రూపంలో ఇచ్చి మూడు వికెట్లు నేలకూల్చాడు. మరో ఎండ్‌లో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి కూడా పాక్ పతనానికి ఉడతాభక్తిగా సాయం చేశారు. ఇక తురుపుముక్క బూ మ్.. బూమ్ బుమ్రా కూడా రెండు వికెట్లు తీసి పాక్‌ను కోలుకోనీయకుండా చేశాడు. 

83/0 నుంచి 146/10 

పాకిస్థాన్ ఇన్నింగ్స్ 83 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా పడలేదు. అదే చివరికి చూసేసరికి 146 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. ఓపెనర్లను మినహాయిస్తే మిగతా తొమ్మిది మంది బ్యాటర్లు కేవలం 63 పరుగులు మాత్రమే జోడించారు. 20 ఓవర్లు కూడా పూర్తిగా ఆడకుండానే 146 పరుగులకే చాపచుట్టేసింది. అరవీర భయంకర బ్యా టింగ్ లైనప్ ఉన్న భారత్ ముందు 147 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిలిపింది. 

ఆదిలోనే షాక్.. 

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి ది గిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లో ఫోర్ కొట్టి టచ్‌లో కనిపించిన చిచ్చరపిడుగు అభి‘షేక్’ శర్మ (5) తర్వాతి ఓవర్లోనే వెనుదిరిగాడు. అభిషేక్ శర్మ పవర్‌ప్లేలోనే పెవిలియన్‌కు చేరడంతో అభిమా నులంతా షాక్ అయ్యారు. అదే షాక్‌లో ఉండగానే వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1) కూడా పెవిలియన్‌కు చేరి నిరాశపర్చాడు.

ఆసియా కప్ ఆసాంతం నిరాశపరుస్తూ వచ్చిన స్కై ఫైనల్‌లో కూడా బ్యాట్ ఝలిపించలే కపోయాడు. స్కై నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (69*) మరో ఓపెనర్ గిల్‌కు తోడయ్యాడు. వీరిద్దరైనా జట్టును విజయతీరాలకు చేర్చుతారని అంతా భావించినా అలా జరగలేదు.

నాలుగో ఓవర్లో శుభ్‌మన్‌గిల్ (12) వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ సంజూశాంసన్ (24)తో కలిసి తిలక్ వర్మ జట్టు స్కోరును 50 పరుగులు దాటించాడు. ఇక ఈ ఇద్దరు కుదురుకున్నారని అనుకుంటున్న తరుణంలో శాంసన్ స్పిన్నర్ అహ్మద్ బౌలిం గ్‌లో వెనుదిరిగాడు. 

దంచేసిన దూబే.. 

ఆల్‌రౌండర్ శివమ్ దూబే (33) తిలక్ వర్మకు జతకుదిరి పాక్ బౌలర్లకు పరీక్ష పెట్టా డు. ఈ జోడీ అయిదో వికెట్‌కు 50+ పరుగులు జోడించింది. జట్టు ఆల్మోస్ట్ గెలిచిన త ర్వాత శివమ్ దూబే సిక్స్‌కు ప్రయత్నించి ఔ టయ్యాడు. బౌండరీ రోప్ వద్ద షహీన్ షా అఫ్రిది కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. దీంతో 50+ పరుగుల భాగస్వామ్యానికి తెరపడిం ది. శివమ్ దూబే పెవిలియన్ చేరినా కానీ తి లక్ వర్మ మాత్రం పాక్‌ను వదల్లేదు.

చివరి ఓవర్లో 10 పరుగులు అవసరం అవగా.. తొలి బంతికి 2 పరుగులు తీశాడు. రెండో బంతిని స్టాండ్స్‌లోకి పంపి.. భారత విజయాన్ని ఖరారు చేశాడు. భారత్ ఇంకా రెండు బంతులు మిగిలుండగానే ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసియా కప్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో దాయాదులు తలపడడం ఇదే తొలిసారి. 

జెట్‌ను కూల్చేసిన బుమ్రా.. 

సూపర్ మ్యాచ్‌లో పాక్ బౌలర్ హరిస్ రౌఫ్ ఓవరాక్షన్ చేశాడు. ఫీల్డింగ్ చేస్తున్న రౌఫ్ అ భిమానులతో వెకిలి చేష్టలు చేశాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో తా ము భారత్‌కు చెందిన ఆరు జెట్లను కూల్చామని సైగలు చేశాడు. దీంతో ఐసీసీ అతడి మ్యాచ్ ఫీజులో కోత కూడా విధించింది.

ఆదివారం జరిగిన ఫైనల్‌లో టెయిలెండర్‌గా బరిలోకి ది గిన రౌఫ్ (6)ను బుమ్రా బౌల్డ్ చేసి జె ట్ కూలినట్టు సంబురాలు చేసుకున్నా డు. ఫైనల్‌లో మూడు వికెట్లు తీసిన పాక్ బౌలర్ అష్రఫ్ ఓవరాక్షన్ చేశా డు. అబ్రార్ కూడా సంజూవికెట్ తీసి న తర్వాత అతగాడి సెలబ్రేషన్స్ మితిమీరాయి. పెవిలియన్‌ను చూపిస్తూ సంజూను వెళ్లమన్నట్టు తలూపాడు.